బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సాగుతున్న నాల్గో టెస్టులో తెలుగు కుర్రాడు దుమ్మురేపాడు. భారత్ తొలిఇన్నింగ్స్లో అవతలి ఎండ్లో వికెట్లు పడుతున్నప్పటికీ జారుగా ఆడిన నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది మొదటి సెంచరీ. ఈ టోర్నీతోనే టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన నితీష్ మొదటి టెస్టు నుంచి ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు.
164/5 ఓవర్నైట్ స్కోర్తో భారత్ మూడో రోజు ఆట ప్రారంభించింది. అప్పటికి క్రీజ్లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. అనవసరమైన షాక్కు ప్రయత్నించిన రిషబ్ పంత్ త్వరగానే అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ అవుటైన తర్వాత క్రీజ్లోకి వచ్చాడు నితీష్. జడేజాతో కలిసి కాసేపు స్కోర్ను పరుగులు పెట్టించాడు నితీష్. 221 పరుగుల వద్ద జడేజా తన వికెట్ కోల్పోయాడు. తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్తో కలిసి ధాటిగా ఆడాడు నితీష్, ఈ క్రమంలోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వాషింగ్టన్ సుందర్ కూడా తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎనిమిదో వికెట్కు ఇద్దరు రికార్డు భాగస్వామం నెలకొల్పారు. భారత్ ధాటిగా జవాబు ఇస్తుందన్న టైంలో సుందర్ హాఫ్ సెంచరీ పూర్తి అయిన తర్వాత 348 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బుమ్రా కూడా పరుగులు ఏమీ చేయకుండానే అవుట్ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా నితీష్ మాత్రం ఏకాగ్రతతో చెత్త బంతుల్నీ బౌండరీలకు పంపిస్తూ తన మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
నితీష్ సెంచరీ చేయడమే కాకుండా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇన్నింగ్స్ తేడాను భారీగా తగ్గించారు. నితీశ్ 171 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు నితీష్ సెంచరీ చేస్తే , జైస్వాల్ 82 పరుగులు సాధించాడు. తర్వాత సుందర్ హాఫ్ సెంచరీ కొట్టాడు. మిగతా బ్యాటర్లు అంతా ఫెయిల్ అయ్యారు. నవంబర్లో జరిగిన తొలి టెస్టుతో అరంగేట్రం చేసిన నితీష్ అప్పుడు కూడా తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఆ టెస్టులో 41 పరుగులు చేశాడు.
ఇప్పుడు నాల్గో టెస్టులో సెంచరీ చేశాడు. ఇదే ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసినప్పుడు తగ్గేదేలే అన్నట్టు పుష్ప మ్యానరిజాన్ బ్యాట్తో చూపించడం వైరల్ అవుతోంది. ఈ వీడియోను టీమిండియా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.