Padma Shri: క్రికెట్‌లో అశ్విన్‌, హాకీలో పిఆర్ శ్రీజేష్‌కు పద్మ పురస్కారం

Padma awards 2025 in sports category

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పేర్లను హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు, భారత హాకీ ప్లేయర్‌ పీఆర్ శ్రీజేష్‌ సహా మరో ఇద్దరికి పద్మశఅరీ వరించింది.

భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పేర్లలో అశ్విన్‌ పేరు ఉంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టైంలో అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు పలికాడు. దేశానికి చేసిన సేవకు గుర్తింపుగా ఈ ఆఫ్ స్పిన్నర్ పద్మశ్రీ అవార్డుతో కేంద్రం సత్కరించింది. క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకడు.

టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు అశ్విన్. 106 టెస్ట్ మ్యాచ్‌లు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లలో భారతకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టు మ్యాచ్‌లలో 24.01 సగటుతో 537వికెట్లు తీసుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో 37 సార్లు 5 వికెట్లు తీసిన ఘనత ఇతనిపేరుపై ఉంది. వన్డే ఫార్మాట్‌లో అశ్విన్ 33.21 సగటుతో 4.93 ఎకానమీతో 156 వికెట్లు నేలకూల్చాడు. భారత్ తరఫున టీ20 మ్యాచ్‌ల్లో 6.91 ఎకానమీతో 23.22 సగటుతో 72 వికెట్లు తీసుకున్నాడు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తోపాటు పుణె సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లలో అశ్విన్ ఆడాడు. ఐపీఎల్‌లో 211 మ్యాచుల్లో 7.12 ఎకానమీ, 29.83 సగటుతో 180 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో కూడా అశ్విన్ సత్తా చాటాడు. టెస్ట్‌ల్లో 3503 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు 14 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 707 పరుగులు చేశాడు. T20 ఫార్మాట్లలో 184 పరుగులు చేశాడు.

భారత హాకీ జట్టు లెజెండరీ గోల్ కీపర్ PR శ్రీజేష్‌కు పద్మభూషణ్ లభించింది. వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన భారత హాకీ జట్టులో పీఆర్ శ్రీజేష్ సభ్యుడుగా ఉన్నాడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకాన్ని గెలుచుకోగా, పారిస్ ఒలింపిక్స్ 2024లో మళ్లీ పతకం సాధించింది భారత్‌ జట్టు. ఈ సందర్భాల్లో పీఆర్ శ్రీజేష్ కీలక పాత్ర పోషించారు. వీళ్లతోపాటు సత్యపాల్ సింగ్, ఇనివలపిల్ మణి విజయన్, హర్విందర్ సింగ్‌ను పద్మశ్రీతో కేంద్రం గుర్తింపు ఇచ్చింది.

ఇనివలపిల్ మణి విజయన్ మరియు హర్విందర్ సింగ్ ఎవరు?
భారత ఫుట్‌బాల్ ఆటగాడు ఇనివలప్పిల్ మణి విజయన్ అత్యంత దూకుడు కలిగిన ఆటగాడు. ఏప్రిల్ 25, 1969న కేరళలోని త్రిసూర్‌లో జన్మించాడు. ఇనివాళప్పిల్ మణి విజయన్ తన చిన్ననాటి రోజుల్లో త్రిస్సూర్ మున్సిపల్ స్టేడియంలో గోళీ సోడా విక్రయించేవాడు, కానీ తరువాత ఫుట్‌బాల్‌తో పేరు తెచ్చుకున్నాడు.

భారత ఆర్చర్ హర్విందర్ సింగ్‌ను పద్మశ్రీతో సత్కరించింది కేంద్రం. పారిస్ పారాలింపిక్స్‌లో హర్విందర్ సింగ్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. పారాలింపిక్స్‌లో ఆర్చరీలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా హర్విందర్ సింగ్ నిలిచాడు. టోక్యో పారాలింపిక్స్‌లో హర్విందర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

తరవాత కథనం