Manamsaitham: ‘కాదంబరి ఫౌండేషన్-మనంసైతం’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో షుర్ సంస్థ వారి.. CSR సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని ఎల్ఐజీ ప్రాంగణంలో రెనోవా హాస్పిటల్ విద్యానగర్ వారి సహకారంతో ‘కాదంబరి ఫౌండేషన్-మనంసైతం’ సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో వందలాది మంది పాల్గొని, వైద్య సేవలను పొందారు. ఈ శిబిరంలో కంటి, దంత, బీపీ, హార్ట్, వెయిట్, బీఎంఐ, కాన్సర్, హోమియో, బీఎండీ వంటి వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘కాదంబరి ఫౌండేషన్-మనంసైతం’ సంస్థ నిర్వహకులు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. ”ఆరోగ్యమే మహాభాగ్యం.. ఎవరికైనా మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ఈ పండగ రోజున ప్రముఖ ఆస్పత్రుల డాక్టర్లతో కలిసి ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆశీస్సులతో ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. గత 10 సంవత్సరాలలో 50 వేల మంది నిస్సాహయులకు తమ ఫౌండేషన్ నుంచి సాయం అందించాం అని వెల్లడించారు.
అలాగే సపర్య వదిలేసిన నిస్సాహయులను తాము చేరదీస్తాం అని, అనాధ, వృద్ధాప్య ఆశ్రమం ప్రారంభించి సేవ చేసుకోవడంమే తన జీవిత లక్ష్యమని తెలిపారు. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. ‘మనంసైతం’ అండగా ఉంటుంది” అని కాదంబరి కిరణ్ హామీ ఇచ్చారు. నటుడు వినోద్బాల మాట్లాడుతూ.. మనంసైతం కాదంబరి ఫౌండేషన్ నుంచి కాదంబరి కిరణ్ ఎన్నో ఏళ్లుగా ఎన్నో సేవలు చేస్తున్నారు.
ఆయన టీంలో తాము కూడా ఇలా సేవల్లో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తాం అని ఆనందం వ్యక్తం చేశారు. చిత్రపురి కాలనీలోని కార్మికులకు వైద్య సేవలు అందించడం నిజంగా సంతోషంగా ఉంది. అని అన్నారు. మనంసైతం సేవ యజ్ఞంలో తాము కూడా నిరంతరం పాలుపంచుకుంటామని కస్తూరి శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో LIG వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులూ, పలువురు నటీనటులు, వివిధ శాఖల సినీ కార్మికులు పాల్గొని ‘మనంసైతం’ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు.